ఈ కుటిల ప్రచారాల్ని నమ్మేదెవరు సార్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని ఎత్తుకుంది. ఇది కుటిల వ్యూహమే.. ఇలాంటి వ్యూహాల  వలన పెద్దగా ఒరిగేది ఏమీ లేదనే సంగతి మాత్రం వారు గుర్తించడం లేదు. రాజకీయంగా ఏదో అద్భుతాలు సృష్టించేస్తాం అనే భ్రమల్లో ఏదో ఒకటి చేస్తున్నట్టుగా తమ అధినేత కళ్లలో వెలుగులు నింపడానికి వారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప.. సాధించేది మాత్రం సున్నానే. ఇంతకూ వారు ఏం చేస్తున్నారో తెలుసా?
ఒక్కొక్క జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు, ఆ జిల్లాలోని సాక్షి విలేకరులందరినీ ఉమ్మడిగా పిలిచి.. ఓ ఖరీదైన సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లా పార్టీ నాయకులే.. సాక్షి విలేకరులందరికీ మార్గనిర్దేశనం చేస్తున్నారు. ఏం పనిచేయాలి? ఎలా పనిచేయాలి? మన దృక్కోణం ఎలా ఉండాలి? అనే విషయాల్లో వారికి ఓరియెంటేషన్ ఇస్తున్నారు. ఇలాంటి భేటీలలో ప్రధానంగా వారి లక్ష్యం ఒక్కటే! వారు చెబుతున్నది ఒక్కటే. ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి.

క్షేత్ర స్థాయిలో ప్రభుత్వాన్ని నిందించడానికి, ప్రభుత్వంమీద బురద చల్లడానికి ఏ చిన్న అవకాశం కనిపించినా సరే.. వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. లేదా.. మన పత్రికలో వార్తగా రాయండి.. అనే సూచన తొలిదశ.
దీనికి రెండో దశ కూడా ఉంది. లోకల్ గా సాక్షి విలేకరులు ప్రభుత్వాన్ని తిట్టడానికి పనికొచ్చే పాయింట్స్ పార్టీ వారికి చేరవేస్తే.. వారు ఉద్యమాలు చేస్తారు. ప్రకటనలు చేస్తారు. వాటికి పత్రికలో భారీ ప్రచారం ఇవ్వాలి. లేదా.. ముందే వార్తలు రాసేస్తే ఆ తర్వాత వారు ప్రకటనలు, ఉద్యమాలు చేస్తారు. మళ్లీ ప్రచారం భారీగా ఇవ్వాలి. ఏది ఎటువచ్చినా సాక్షిలో భారీ ప్రచారం మాత్రం కావాలి.. అనేది వారి సూచన.

అయితే ఇలాంటి కుటిల వ్యూహాలు వర్కవుట్ కావు.. అని వైసీపీ నాయకులు గుర్తించడం లేదు. ఎందుకంటే.. సాక్షి పత్రికను చదివే వాళ్లలో నూటికి నూరుశాతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు, జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులు మాత్రమే ఉంటారు. వారిని నిలువునా చీల్చినా సరే.. వారు వైసీపీకి మాత్రమే ఓటు వేస్తారు తప్ప.. మరోవైపు చూడరు. వైసీపీ నాయకులు చేసే ఇలాంటి ప్రయోగాల  వలన కొత్తగా చంద్రబాబు మీద ఎంత బురద చల్లితే మాత్రం.. అలాంటివారిని కొత్తగా రంజింపజేసేది ఏముంటుంది? వారు ఆల్రెడీ వైసీపీ ఓటర్లే కదా. అలాగే తటస్థ ఓటర్లు ఎవరూ సాక్షిని చదవరు. ఏపీ రాజకీయాలకు సంబంధించినంత వరకు సాక్షిలో నిజం వచ్చినాసరే.. అది వక్రీకరణ అని మాత్రమే తటస్తులు అనుకునే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో.. సాక్షితో వైసీపీ నేతలు భేటీలు నిర్వహించి కుటిల ప్రచారాలు సాగిస్తే నమ్మేదెవరు సార్? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories