గ్రూప్ 1 ప్రశ్నపత్రాలను మాన్యువల్ గా మూల్యాంకనం చేయించాల్సిందే అని హైకోర్టు ఆదేశిస్తే.. సాక్షాత్తూ హైకోర్టునే బుకాయించగలననే నమ్మకంతో.. ఎవరు చూడొచ్చారులే అనే ధైర్యంతో అడ్డగోలుగా వ్యవహారం నడిపించి అభాసుపాలైన సీనియర్ ఐపీఎస్ అధికారి.. పీఎస్సార్ ఆంజనేయులు! ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా జగన్ సేవలో తరించిన ఆయన సాధారణ పోలీసులు విచారణ సాగిస్తున్నప్పుడు.. అందుకు పూర్తిగా సహకరించగలరని అనుకోవడం కూడా భ్రమ. ఆయన పోలీసు డిపార్టుమెంటుకు అలవాటైన అధికార దర్పాన్ని, తన సీనియారిటీని మొత్తం.. విచారణ చేస్తున్న అధికార్లను బెదిరించడానికే వాడుతున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా గ్రూప్ 1 మూల్యాంకనానికి సంబంధించి.. రిమాండులో ఉన్న కీలక నిందితులు పీఎస్సార్ ఆంజనేయులు, ఆయన అప్పగించిన పనిని ఆయన ఆదేశాల మేరకు అడ్డదారుల్లో పూర్తిచేయడంలో సహకరించిన పమిడికాల్వ మధుసూదన్ లు బెయిలుకోసం దరఖాస్తు చేసుకున్న సందర్భంగా పోలీసుల వాదనల్లో ఈ విషయాలు బయటకు వస్తున్నాయి.
విచారణలో పోలీసులు ఏం అడిగినా కూడా.. ప్రతిదానికీ నేనే బాధ్యుణ్నా అంటూ పీఎస్సార్ దర్యాప్తు అధికారుల్నే బెదిరిస్తున్నారంటూ.. వారి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. పీఎస్సార్ హోదా రీత్యా.. ఆయనకు బెయిలు ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని పోలీసులు వాదిస్తున్నారు. నిందితులు ఇద్దరికీ దిగువకోర్టు బెయిలు నిరాకరించడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.
అయితే పీఎస్సార్ తరఫు వాదనలు మాత్రం.. హైకోర్టును ఇప్పటికీ బురిడీ కొట్టించాలనే ఉద్దేశంతోనే చెబుతున్న కాశీమజిలీ కథల్లాగా ఉంటున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. హాయల్యాండ్ రిసార్టులో అసలు మూల్యాంకనమే జరగలేదని, డిజిటల్ మూల్యాంకనంలో ఏమైనా తప్పులు జరిగాయా? అనే పరిశీలన మాత్రమే జరిగిందని వారు కోర్టుకు చెబుతున్నారు. అదే సమయంలో పమిడికాల్వ మధుసూదన్ తరఫు న్యాయవాదులు మాత్రం.. డిజిటల్ మూల్యాంకనం ఒప్పందాన్ని తమకు అప్పగించినట్టుగా పేర్కొంటున్నారు. బెయిలు కోరుతున్న ఇద్దరు నిందితుల వాదనలే పరస్పర విరుద్ధంగా కనిపిస్తుండడం ఇక్కడ గమనించాల్సిన సంగతి.
క్యామ్ సైన్ సంస్థ ఒకవైపు తమ సంస్థ ఉద్యోగులతోను, ఏపీపీఎస్సీ అధికారి భార్యతోను కూడా మూల్యాంకనం చేయించినట్టుగా ఆధారాలు దొరుకుతుండగా.. అసలు మూల్యాంకనం అనే ప్రక్రియే జరగలేదని ఇప్పటికీ బుకాయించగలనని పీఎస్సార్ ఆంజనేయులు నమ్మడం చాలా చిత్రంగా కనిపిస్తోంది. ఆయన తన సీనియారిటీ మొత్తాన్ని అధికార్లను బెదిరించడానికి, కోర్టును తప్పుదోవ పట్టించడానికి వాడుతున్నట్టుందని ప్రజలు భావిస్తున్నారు.