పాన్ ఇండియా సినిమాల ట్రెండ్కు దారి చూపించిన చిత్రం బాహుబలి. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునేలా, భారతీయ సినీ ఇండస్ట్రీనే కొత్త దిశగా తీసుకెళ్లిన ఈ ఫ్రాంచైజ్ రెండు భాగాలు అప్పట్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించాయి. ఈ సినిమాలతో హీరో ప్రభాస్కు పాన్ ఇండియా స్టార్ హోదా వచ్చిందంటే అది అతిశయోక్తి కాదు. అదే సమయంలో దర్శకుడు రాజమౌళి టేకింగ్కు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఇక ఇప్పుడు ఈ సినిమాలకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. ఇప్పటికే మొదటి భాగాన్ని అక్టోబర్లో తిరిగి విడుదల చేస్తామని గతంలో ప్రకటించగా, ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 రెండింటినీ కలిపి ఒకే సినిమాగా కట్ చేసి థియేటర్లలో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ రెండు భాగాల కథను కలిపి కాంపాక్ట్ వెర్షన్గా మార్చి, ప్రేక్షకులకు కొత్త అనుభూతినివ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇకపోతే ఇది సాధారణ రీ రిలీజ్ కంటే భిన్నంగా ఉండబోతోంది. ఆ సినిమాల క్లైమాక్స్లు, కీలక సన్నివేశాల్ని సమపాళ్లలో సెట్ చేసి అందుబాటులోకి తీసుకురావాలనేది మేకర్స్ ఆలోచన అని ఫిల్మ్ నగర్ టాక్.
ఈ విషయం మీద ఇంకా అధికారిక ప్రకటన రాలేదిగానీ, ఇది నిజంగా జరిగితే మరోసారి థియేటర్లలో బాహుబలి మ్యాజిక్ను చూడాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతుంది. గతంలో వీటిని విడిగా చూసిన ప్రేక్షకులకు ఇప్పుడు ఒక్కసారిగా పూర్తి ప్రయాణం చూసే అవకాశం దక్కనుండటంతో భారీ రెస్పాన్స్ రావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.