ప్రపంచం తలతిప్పి చూసేలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిని తలమానికంగా తీర్చిదిద్దే పనులు ఇప్పటికే శరవేగంతో జరుగుతున్నాయి. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసి వెళ్లిన తర్వాత దాదాపు 30 వేల మంది భవన నిర్మాణ కార్మికులు వివిధ ప్రాజెక్టులలో నిమగ్నమై శరవేగంతో అక్కడ పనులు పూర్తి చేయడానికి కష్టపడుతున్నారు. అమరావతి నగర నిర్మాణం కృషికి సమాంతరంగా.. న్యూ అమరావతి విస్తరణ ప్రాజెక్టుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దాదాపు 40 నుంచి 45వేల ఎకరాల మేర అమరావతి విస్తరణ కోసం ప్రయత్నిస్తుండగా ఇప్పటికే 38 వేల ఎకరాలను భూ సమీకరణ రూపంలో ఇవ్వడానికి రైతుల సంసిద్ధంగా ఉన్నట్లు మంత్రి నారాయణ ప్రకటిస్తున్నారు. అమరావతి నగరం అనేది యావత్ దేశంలోని మహానగరాలలో ఒకటిగా ఆవిష్కృతం కావడానికి ఇది ఒక శుభసంకేతం అని ప్రజలు అనుకుంటున్నారు.
అమరావతి రాజధాని నిర్మాణం వేగం పుంజుకున్న సంగతి అందరికీ తెలుసు. అదే సమయంలో ఈ రాజధాని వ్యాప్తంగా వచ్చే స్మార్ట్ పరిశ్రమలకు అందుబాటులో ఉండేలాగా ఒక అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు సంకల్పించారు. అందుకు కనీసం 5000 ఎకరాల స్థలం కేటాయించాలని అనుకున్నారు. అలాగే సుమారు 16 వందల ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని కూడా చంద్రబాబు నాయుడు సంకల్పిస్తున్నారు.
ఈ సంకల్పానికి స్థానికంగా ప్రజల, రైతుల మద్దతు పుష్కలంగా లభిస్తూ ఉంది. ఒకవైపు అమరావతి నగరం పూర్తి చేయకుండా.. నగర విస్తరణ గురించి ఆలోచిస్తూ ఉండడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించింది గాని అదంతా ఉత్తిదేనని తేలిపోయింది. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం, స్పోర్ట్ సిటీ, స్మార్ట్ పరిశ్రమల కోసం 45 నుంచి 45 వేల ఎకరాల భూమి సమీకరణ రూపంలో అవసరం అని భావిస్తుండగా.. 38వేల ఎకరాలు ఇవ్వడానికి రైతులు సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి నగర విస్తరణ ప్రయత్నాలదిశగా ఇది గొప్ప సంగతి.
అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారో.. ఎలాంటి హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమరావతి విస్తరణకు భూములు ఇచ్చే రైతులకు కూడా వర్తిస్తాయని మంత్రి నారాయణ స్పష్టీకరిస్తున్నారు. ఎంతగా స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తే అంతగా ఈ ప్రాంతం విస్తృత అభివృద్ధి చెందుతుందని నారాయణ రైతులకు హామీ ఇస్తున్నారు. అమరావతి నగర నిర్మాణ పనులు టాప్ గేర్ లో నడుస్తున్నందుకు రైతులు హర్షామోదాలు వ్యక్తం చేస్తున్నారు.