‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అనే భారతీయ జనతా పార్టీ ఎజెండాకు పవన్ కల్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు ఒక సత్సంకల్పంతోనే జమిలి ఎన్నికల విధానాన్ని తీసుకువచ్చిందని ఆయన చెబుతున్నారు. ఈ పోకడ వలన పరిపాలన పరమైన సమస్యలు దూరమౌతాయని ఆయన చెబుతున్నారు. ఎక్కడైతే కేంద్రంలోని మోడీ సర్కారును ప్రతి విషయంలోనూ తీవ్రంగా వ్యతిరేకించే డీఎంకే ప్రభుత్వం పాలన సాగిస్తున్నదో.. అదే చెన్నై వేదికగా జరిగిన సెమినార్ లో పాల్గొన్న పవన్ కల్యాణ్ జమిలి ఎన్నికలను స్వాగతించాలని అందరికీ సందేశం ఇవ్వడం విశేషం.
మోడీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంటున్నది అంటే.. విధానంతో నిమిత్తం లేకుండా.. అందులోని మంచి చెడుల గురించి ఆలోచన ఏమాత్రం చేయకుండానే.. దానిని వ్యతిరేకించడానికి ఒక వర్గం సిద్ధంగా ఉంటుంది. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం గానీ, సీఎం స్టాలిన్ గానీ ఆ కోవకే చెందుతారు. మోడీని సమర్థించేవారు మహా అయితే ఈ జమిలి ఎన్నికలు మంచివి అని దేశానికి శ్రేయస్కరం అని చెప్పగలరు. కానీ పవన్ కల్యాణ్ అంతకు మించి బాధ్యత తీసుకుంటున్నారు. జమిలి ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకించి.. ఆ విధానానికి దురుద్దేశాలు ఆపాదిస్తున్న స్టాలిన్ ను కూడా ఒప్పించడానికే తాను చెన్నై వచ్చానని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. స్టాలిన్ ఎందుకు ఒప్పుకోవాలో కూడా ఆయన వివరిస్తున్నారు. ఆయన పట్టుదలను గమనిస్తే.. కేంద్రం సంకల్పిస్తున్న జమిలి ఎన్నికల విధానానికి పవన్ కల్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది.
‘అత్త పగలగొడితే పాతకుండ.. కోడలు పగలగొడితే కొత్తకుండ’ అనేసామెతను ప్రస్తావిస్తూ.. వాళ్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే ఆలోచన చేశారు.. ఇప్పుడు మోడీ ప్రభుత్వం సంకల్పిస్తే మాత్రం అడ్డుకుంటున్నారు అని పవన్ కల్యాణ్ విమర్శించారు. గతంలో కరుణానిధి కూడా ఈ విధానం ఉండాలని కోరుకున్నట్టుగా పవన్ చెబుతున్నారు. జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలు తీసుకున్న నిర్ణయాలపై పునరాలోచన చేయాలని ఆయన అంటున్నారు.
వీటిని వ్యతిరేకించకుండా.. అన్ని పార్టీలు కలిసి కూర్చుని ఏమైనా ఇబ్బందులు కనిపిస్తే వాటి గురించి మాట్లాడాలని, పరిష్కరించుకోవాలని ఆయన సూచించడం విశేషం.