పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరగడమే లక్ష్యంగా వ్యవహరించిన మాజీ మంత్రి కాకాణి గోవర్దనరెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. 55 రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ, వారిని ముప్పుతిప్పలు పెట్టడానికి ప్రయత్నిస్తూ వచ్చిన ఈ జగన్ సహచరుడికి ఎట్టకేలకు కటకటాలయోగం తప్పలేదు. పోలీసులను బట్టలూడదీయించి కొడతానని హెచ్చరించిన ఈ మాజీమంత్రి.. కర్ణాటక సమీపంలోని ఒక గ్రామంలో రిసార్టులో తలదాచుకుని ఉండగా పోలీసులు అరెస్టు చేసి నెల్లూరుకు తరలించారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగం, గిరిజనులను బెదిరించడం వంటి కేసులు కాకాణి మీద ఉన్నాయి.
నెల్లూరుజిల్లా పొదలకూరు వద్ద తాటిపర్తి సమీపంలో 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న క్వార్ట్జ్ మైన్స్ కు సంబంధించి అక్రమాలు జరిగాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఈ అక్రమాలు షురూ అయ్యాయి. కాకాణి అనుచరులు ఇక్కడ చెలరేగిపోయారు. విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టి క్వార్జ్ట్ ను తరలించారు. అధికార పార్టీకి చెందిన నాయకుడి దందా కావడంతో అధికారులు పట్టించుకోలేదు. ఇక్కడ తవ్వకాల కోసం భారీ ఎత్తున పేలుడుపదార్థాలు ఉపయోగిస్తున్నట్టుగా అనేక ఫిర్యాదులు వచ్చాయి. అలాగే ఈ అక్రమ తవ్వకాలకు నిరసనగా స్థానిక గిరిజనులు ఆందోళనలు కూడా చేశారు. వారిని కూడా తీవ్రంగా బెదిరించడంతో వారు వెనక్కు తగ్గారు. అయితే తెలుగుదేశానికి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టలేదు. స్థానికంగా ఆందోళనలు చేసినా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆయన జిల్లా కలెక్టరు, ఎస్పీ దగ్గరినుంచి ప్రధాని వరకు అందరికీ లేఖలు రాశారు. దీంతో గత ఎన్నికలకు ముందు ఒత్తిడి తాళలేక రెవెన్యూ అధికారులు తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. మొత్తం 61313 టన్నుల క్వార్ట్జ్ అక్రమంగా తరలిపయినట్లు తేల్చారు. సీనరేజీ చార్జీలతో పాటు పదింతల జరిమానా కలిపి 7.13 కోట్లు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. వైసీపీ నాయకులు శ్యాంప్రసాద్ రెడ్డి, శివారెడ్డి, శ్రీనివాసులరెడ్డితోపాటు వారికి అండదండగా ఉంటూ మొత్తం వ్యవహారం నడిపించిన కాకాణి గోవర్దనరెడ్డిపై కేసు నమోదు అయింది.
అప్పటినుంచి కనీసం విచారణకు రావాలని పోలీసులు నోటీసు ఇవ్వడానికి ప్రయత్నించినా దొరక్కుండా కాకాణి పారిపోయారు. రెండు రోజులకు ఒక చోటు మారుస్తూ పోలీసులకు దొరక్కుండా తిరిగారు. మరోవైపు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టులోను, సుప్రీం కోర్టూలోను నడిపారు. అక్కడంతా కేసును కొట్టేయడంతో.. పోలీసులు ఆయనను అరెస్టు చేసి తరలించారు.
వైసీపీకి చెందిన అత్యంత వివాదాస్పద నాయకుల్లో ఒకరైన కాకాణి గోవర్దనరెడ్డి మీద ఇంకా పలు కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయన అరెస్టు తర్వాత… ఒక్కొక్కటిగా అన్ని కేసులు తెరమీదకు వస్తున్నట్టు సమాచారం.