మొహం చాటేస్తున్న వైసిపి పులులు 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీడియా ముందు మాట్లాడే ప్రముఖులు కొంతమంది ఉంటారు. ప్రెస్ మీట్ ఎవరు పెట్టినా సరే వారి డిపార్టుమెంటు ఏదైనా సరే.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి అప్రూవల్ పొంది వచ్చిన స్క్రిప్ట్ ను చదివి వినిపించాల్సిందే తప్ప వారికి వేరే పని ఉండదు- అనే సంగతి అందరికీ తెలుసు. కొమ్ములు తిరిగిన నాయకులు కూడా చంద్రబాబు నాయుడుని తిట్టడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియా విలేకరులందరూ వచ్చిన తర్వాత.. అందరికీ ఫలహారాలు కాఫీలు సరఫరా చేస్తూ.. తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వచ్చేదాకా ఒక మాట కూడా మాట్లాడకుండా ఎదురుచూస్తూ గడిపిన సందర్భాలు గత ఐదు సంవత్సరాలలో ఎన్నో ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణమైన పరాజయం తర్వాత ఇప్పుడు మీడియా ముందు గాండ్రించే వైసిపి పులులు చాలా వరకు మొహం చాటేస్తున్నారు.

పార్టీ తరఫున ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేయడానికి, చంద్రబాబు నాయుడు విధానాలను పరిపాలనను తిట్టడానికి.. వైసిపి నాయకులు చాలామంది ముందుకు రావడం లేదు. అన్ని కులాల నుంచి ఒక్కొక్క నాయకుడు ప్రభుత్వాన్ని తిట్టే లాగా మామూలుగా జగన్మోహన్ రెడ్డి అనుచర దళాలు ప్రణాళిక రచన చేస్తుంటాయి గాని.. మీడియా ముందు మాట్లాడడంలో ఫేమస్ అయిన చాలామంది నాయకులు ఇప్పుడు ప్రెస్మీట్లు పెట్టడం లేదు. తాడేపల్లి వైసీపీ కార్యాలయం నుంచి వారికి ఫోన్లు వెళుతున్నప్పటికీ స్పందించడం లేదు. మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సిందిగా జగన్ సార్ చెప్పారు అని ఫోన్ చేసినా సరే.. ఏదో ఒక సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. తమ పార్టీ నాయకులే నిన్నటిదాకా చంద్రబాబును తిట్టడానికి చెలరేగిన వారే ఇప్పుడు మొహం చాటేస్తుండడం వైసిపికి కొత్త అనుభవంగా ఉంది. 

చంద్రబాబును తిట్టడానికి ముందుకు రాకపోయినంత మాత్రాన ఈ నాయకులందరూ కూడా పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరడానికి సిద్ధపడుతున్న వారు అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇలా మౌనంగా ఉంటున్న చాలామంది నాయకులు కూటమిలోని మూడు పార్టీలలో ఏ ఒక్క దానిలోకి కూడా ఎంట్రీ కి కూడా అవకాశం లేదు. అయితే వారు ఇప్పుడు ప్రెస్ మీట్ లకు విముఖత చూపించడానికి కారణం వేరు. తాడేపల్లి ప్యాలెస్ లో ఫ్యాబ్రికేట్ అయి వస్తున్న అర్థంపర్థం లేని ఆరోపణలు తాము చదువుతూ కూర్చుంటే తమ పరువు కూడా పోతుందని వారు భయపడుతున్నారు. ప్రభుత్వం మంచిగానే పాలన సాగిస్తున్నదని.. అడ్డగోలుగా వారి మీద విమర్శలు చేస్తే తమ అజ్ఞానం గురించి ప్రజలు నవ్వుకుంటారని వారు ఆందోళన చెందుతున్నారు. అందుకే అసలు ప్రెస్ మీట్ అంటేనే జడుసుకుంటున్నారు. 

చాలామంది సీనియర్ నాయకులు ఇలాంటి విముఖత చూపిస్తూ ఉండడం వలన.. వైసిపి ఒకరిద్దరి మీదనే ఆధార పడాల్సి వస్తుంది. ప్రజలు ఎంత నవ్వుకున్నా సిగ్గుపడకుండా లాజిక్ లేని మాటలు మాట్లాడే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాత్రమే ఇప్పుడు పార్టీ తరఫున ప్రెస్ మీట్లకు రెడీ అవుతున్నారు. ఆయనకు ఎటూ ఇతర పార్టీలోకి ఎంట్రీ కూడా లేదు గనుక తెగించి ఏ చెత్త స్క్రిప్ట్ వచ్చినా సరే దానిని చదివేస్తున్నారు. మరీ అంత మూర్ఖంగా తామంతా వ్యవహరించలేం.. అనే ఉద్దేశంతో చాలామంది సీనియర్ నాయకులు వైసిపి పురమాయింపులకు కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories