పార్టీ దూకుడుకు బ్రేకులు వేస్తున్న చంద్రబాబు 

ఇన్నాళ్ళూ అనేక అవమానాలను భరిస్తూ, సహిస్తూ వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తమ గురించి తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉంటే సహించలేక పోతున్నారు. ఇంకా తమ మీద భౌతికంగాను పరోక్షంగానూ దాడులు జరుగుతుంటే ఊరుకోలేక పోతున్నారు. ఇలాంటి అసహనంలో తెదేపా కార్యకర్తలు కొందరు అదుపు తప్పిపోతున్నారు. అయితే ఇలాంటి పార్టీ శ్రేణుల దూకుడు కు చంద్రబాబు బ్రేకులు వేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అంతే సంయమనంతో ఉండడం అవసరం అని చెబుతున్నారు. 

తప్పుడు రాతలు రాసినందుకు తెదేపా కార్యకర్తలు కొందరు విశాఖలోని డెక్కన్ క్రానికల్ ఆఫీస్ పై దాడి చేసిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తమ పార్టీ వారు చేసిన పనిపట్ల ముసిముసిగా నవ్వుకోకుండా, వారిని మరింత ప్రోత్సహించకుండా బ్రేకులు వేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియాపై న్యాయపరంగా పోరాడుదాం అని పిలుపు ఇస్తున్నారు. 

అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి అని చంద్రబాబు మార్గదర్శనం చేస్తున్నారు. 

ఇదొక్కటే కాదు.. తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నట్లుగా ప్రవర్తించినప్పుడు కూడా.. చంద్రబాబు ఇదే పని చేశారు. వైసిపి వారి భవనాన్ని కూల్చేశారు కదా అని మురిసిపోలేదు. 

ఇన్నాళ్ళ అసహనం పెల్లుబుకుతుంది గనుక పార్టీ వారు అక్కడక్కడా అదుపు తప్పడం సహజం అని.. అయితే చంద్రబాబు నాయుడు చాలా సహనంతో అందరినీ దారిలోకి తెస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories