అమెరికా నుంచి విజయమ్మ వీడియో ప్రచారం !!

అన్నా చెల్లెళ్ల మధ్య విమర్శల సమరంలో ప్రత్యక్షంగా తాను కూడా భాగం కావడం ఇష్టం లేక అమెరికా వెళ్ళిపోయిన వైఎస్ విజయమ్మ అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది. తన కుమార్తె వైఎస్ షర్మిలను.. తన భర్తకు వారసురాలిగా కడపనుంచి ఎంపీ గా చేయడానికి విజయమ్మ కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నించనుంది. ఎన్నికల ప్రచార పర్వం ఇంకా కీలక దశకు చేరుకున్న తరువాత విజయమ్మ ప్రతిరోజూ వరుస వీడియోలను విడుదల చేయడం ద్వారా షర్మిల అనుకూల ప్రచారం చేస్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది.

కడప బరిలో ప్రధానంగా పోటీ అన్నా చెల్లెళ్ళ మధ్యనే అన్నట్టుగా జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ ను, చెల్లెలు షర్మిల ఒక రేంజిలో ఆడుకుంటున్నారు. చిన్నాన్న వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అసలు హంతకుడు అంటూ షర్మిల నిర్దాక్షిణ్యంగా విమర్శలు సంధిస్తున్నారు. హంతకుడిని కాపాడుతున్న దుర్మార్గుడు జగన్ అంటూ ప్రజల ముందు నిలబెడుతున్నారు. ఇప్పటికే వైసీపీ శిబిరంలో ఆమె దడ పుట్టిస్తున్నారు. రెండు మూడు వారాల తర్వాత తల్లి విజయమ్మతో కూడా అమెరికా నుంచి ప్రచార వీడియోలు చేయించి.. వదలాలని ప్లాన్ చేస్తున్నారట.

షర్మిల,  జగన్ తో గొడవ పడి విడిపోయిన తర్వాత విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి ఆ పార్టీ గురించి పట్టించుకోలేదు. జగన్ కూడా తల్లిని పట్టించుకోలేదు.

కానీ ఏపీసీసీ సారథిగా, కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల రంగంలోకి దిగిన తరువాత జగన్ తల్లిని తన పార్టీ తరఫున ప్రచారం చేయాలని కోరినట్లు సమాచారం. అది ఇష్టం లేక ఆమె అమెరికా లోని షర్మిల కొడుకు తన మనవడు వద్దకు వెళ్లిపోయారు. 

అయితే షర్మిల మాత్రం వ్యూహాత్మకంగా తన కొడుకు ద్వారా తల్లితో, తనకు అనుకూలంగా ప్రచార వీడియోలు చేయించి వదలబోతున్నారు. నిజానికి ఇది జగన్ చూపించిన మార్గమే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. షర్మిల సునీతలను తిట్టడానికి జగన్ తమ మేనత్త విమలమ్మ తో వీడియోలు చేయించి వదిలారని, అదే బాటలో షర్మిల తల్లితో చేయిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయమ్మ వీడియోలలో కేవలం అవినాష్ మీద మాత్రం నిందలు వేస్తుందా.. జగన్ ను కూడా విమర్శిస్తుందా అనేది చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories