అవినాష్‌ను గాలికొదిలి.. చెమటోడుస్తున్న వైఎస్ భారతి!

జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతికి, ప్రస్తుతం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్వయంగా మేనమామ కొడుకే. జగన్ చెల్లెలు షర్మిలకు మించిన ప్రాధాన్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయన దక్కించుకోవడానికి ప్రధాన కారణం కూడా అదే. హంతకులను కాపడేందుకు జగన్ తాపత్రయపడుతున్నారని, హంతకులను మళ్లీ చట్టసభలకు పంపాలని జగన్ చూస్తున్నారని మొన్న మొన్నటిదాకా షర్మిల, సునీతలు పదేపదే ఆపాదించిన మాటల వెనుక మర్మం కూడా అదే. అయితే ఈ ప్రాధాన్యం, వైభవం అంతా గతించిపోయిన వ్యవహారం అనుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం మునుపెన్నడూ లేనంతగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో గడపగడపకూ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ భారతి- అక్కడ ఎంపీగా పోటీచేస్తున్న అవినాష్ రెడ్డి పేరును నామమాత్రంగా కూడా ప్రస్తావించడం లేదు. కేవలం తన భర్త జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని, ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని మాత్రమే అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించి ఆయనకు ఓటు వేయాలని అడిగితే చాలు.. అది జగన్ కు పడే ఓటును కూడా పడనివ్వకుండా చే స్తుందనే భయం ఆమెలో వ్యక్తం అవుతున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. అవినాష్ రెడ్డిని భారతి గాలికొదిలేసినట్టే అని కూడా అంటున్నారు.

పులివెందుల నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఈసారి వైఎస్ భారతి గతంలో  ఎన్నడూ లేనంతగా కష్టపడి చెమటోడ్చాల్సి వస్తోంది. అవును నిజమే. గతంలో భారతికి ఇంత కష్టం ఉండేది కాదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ తన సొంత నియోజకవర్గం పులివెందులలో తాను ప్రచారం చేయడం గురంచి పట్టించుకున్నది లేదు. కానీ అప్పట్లో ఆయన బలసంపత్తులు వేరు. అప్పట్లో ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిల ఇద్దరూ ఆయనకోసం పులివెందుల నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగేవారు. ఇంకా సూటిగా చెప్పాలంటే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినంతవరకు భారతికి ఉన్న ఫేస్ వేల్యూ కంటె, ప్రజల్లో విజయమ్మ, షర్మిలకు ఉన్న ఫేస్ వేల్యూనే ఎక్కువ. అందుకే వారినే ఎక్కువగా ప్రచారానికి తిప్పేవారు. కానీ ఈసారి ఎన్నికల్లో జగన్ వారిద్దరినీ కూడా దూరం చేసుకోవడంతో.. పాపం భారతికి భారం పెరిగింది. ఆమె ఒక్కటే ఇంటింటికీ తిరగాల్సి వస్తోంది.

ఎంతగా జగన్ సొంత నియోజకవర్గమే అయినా భారతికి అనేక చేదు అనుభవాలూ ఎదురయ్యాయి. ఒకరిద్దరు మండల స్థాయి నాయకులు పాలన తీరును నిలదీస్తూ ‘నువ్వయినా చెప్పొచ్చు కదమ్మా’ అంటూ భారతినే అడిగారు. జగన్ తో పాటు, అవినాష్ రెడ్డికి కూడా ఓటు వేయమని అడుగుతూంటే.. వెంటనే ప్రజలనుంచి వైఎస్ వివేకా హత్య గురించిన ప్రస్తావన వస్తోంది. హత్య విషయంలో ఆడపడచులు వేసిన ప్రశ్నలే ప్రజలనోటినుంచి వస్తూంటే భారతి సమాధానం చెప్పలేకపోతున్నారు. అందుకే ఆమె పులివెందులలో అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా, జగన్ కు ఓట్లు వేయమని మాత్రమే అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories